telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

అభివృద్ధికి ఒక అవార్డ్ : మాణిక్యమ్మ

6/28/2013

0 Comments

 
Picture
                                  మాణిక్యమ్మ మాజీ సర్పంచ్. ఊరికి చాలా చేశారు. ఊరినే మార్చేశారు. ఊళ్లో వైన్‌షాప్ అన్నదే లేకుండా చేశారు. శుభ్రతకు ఒక అవార్డ్. అభివృద్ధికి ఒక అవార్డ్. ఊరికి ఆమె ఇచ్చిన ‘మనశ్శాంతి’ మరొక అవార్డ్. ఎవరైనా ఇంతక న్న ఏం సాధిస్తారు? ఐతే సాధించడం గొప్ప కాదంటారు మాణిక్యమ్మ! సాధించినదాన్ని నిలుపుకోవడం ముఖ్యం అంటారు. ఇప్పుడామె ఏకైక ధ్యేయం... మద్యం మహమ్మారి మళ్లీ కోరలు చాచకుండా చూడడం! పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ‘గెలిపిస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అనేవాళ్లని చూశాం. మాణిక్యమ్మ మాత్రం... ‘ఎవరు గెలిచినా... ఊళ్ల్లోకి వైన్‌షాపుని మాత్రం రానివ్వం’ అంటున్నారు. ఇది ఆమె ఎన్నికల వాగ్దానం కాదు. ఊరును ఓడిపోనివ్వనని చేస్తున్న ప్రమాణం. 

                            రాష్ట్రంలో ప్రతి గ్రామం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటే గుంటూరులోని కోపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కారుమంచి మాణిక్యమ్మ మాత్రం సంతకాలు సేకరించే ఆలోచనలో ఉన్నారు. మళ్లీ సర్పంచ్‌గా పోటీ చేయదలిస్తే ఓటు వెయ్యమని ఇంటింటికీ తిరిగేందుకు వ్యూహరచనలో మునిగితేలాల్సిన ఆమె... ఆ పని చేయకుండా ఇప్పుడు సంతకాలు ఎందుకు సేకరిస్తున్నారంటే... పరిస్థితులలో ఏమైనా మార్పులు వచ్చి, తనకు బదులు కొత్తగా ఎవరైనా సర్పంచ్ వస్తేగనక... ఊళ్లో మద్యంషాపుకి అనుమతి ఇస్తారేమో... అలా జరగడానికి వీల్లేదని’ ముందుగానే జిల్లా కలెక్టర్‌కి విజ్ఞప్తి చేయడంకోసం!

                      కోపల్లి....ఆదర్శ గ్రామంగా అవార్డు గెలుచుకున్న ఊరు. శుచికీ, శుభ్రతకు ‘నిర్మల్ భారత్ అభియోగ్ అవార్డ్’ కూడా సొంతం చేసుకున్న గ్రామం. అన్నిటికన్నా ఊళ్లో మహిళలంతా మనశ్శాంతిగా జీవించే ఊరది. ఇన్ని గెలుచుకున్నది దేనివల్ల... అంటే ‘మా ఊళ్లో మద్యం అందుబాటులో లేకపోవడం వల్లే’ అని గర్వంగా చెబుతారు మాణిక్యమ్మ. స్వయంగా మాణిక్యమ్మే చొరవచూపి మద్యం మహమ్మారిని ఊరవతలి వరకూ తరిమి తరిమి కొట్టారు. గ్రామాల్లో... మద్యంషాపు పెట్టాలనే ఆలోచనకి, అనుమతికి, ఆచరణకి... నిమిషాలు సరిపోతాయి. అదే కనక మద్యం షాపుని మూయించేయాలంటే అందుకు కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. కోపల్లిలో కూడా అదే జరిగింది. 1997 నుంచి 2004 వరకూ అంటే... ఏడేళ్లపాటు కోపల్లి మహిళలంతా చేసిన పోరాట ఫలితంగాఎన్నికలముందు నాయకులు మద్యంషాపుకి మూతవేయించారు. వీళ్లు ఇంత చేసినా, ఆ తర్వాత కొత్తగా వచ్చిన సర్పంచ్ వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఇన్నేళ్ల వారి పోరాటమంతా గంగలో కలిసిపోయేది. అయితే అదృష్టవశాత్తూ ఆ వచ్చిన సర్పంచ్ మహిళ కావడం, ఆమె అప్పటివరకూ మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన నాయకురాలు మాణిక్యమ్మ కావడం కోపల్లి గ్రామం చేసుకున్న సుకృతమనే చెప్పుకోవచ్చు. 

మహిళలంతా కలిసి...

                     ‘‘పదిహేనేళ్లకిందట మా ఊరి సంగతి ఎలా ఉండేదంటే... పొద్దునే లేవగానే టీ, కాఫీలు తాగినట్టు మా ఊర్లో కొందరు సాయంత్రం అయిందంటే కాసిన్ని మందునీళ్లు నోట్లో పోసుకోకుండా ఇంటికొచ్చేవాళ్లు కాదు. ఇంట్లో భార్యాబిడ్డలతో గొడవపడడం కాకుండా ఎన్నికల సమయంలో పార్టీల పేరుచెప్పుకుని తాగి గొడవపడేవారు. అలాంటి గొడవల్లో ఒకతనికి కన్ను పోయింది. ఒకతనికి కాలు విరిగిపోయింది. ఇవన్నీ చూసి చూసి విసిగిపోయిన మహిళలంతా ఊళ్లో మద్యం షాపు లేకపోతే ఈ బాధలుండవు కదా అనే ఆలోచనకు వచ్చారు. ఇదే విషయాన్ని ఇంట్లో మగాళ్లతో అంటే కొందరు హేళనగా నవ్వితే, మమ్మల్ని తాగొద్దని చెప్పడానికి మీరెవరంటూ కయ్యిమన్నారు ఇంకొందరు. అప్పటివరకూ కోపల్లి మహిళలకు మద్యంషాపు మూయించేయాలనే ఆశ మాత్రమే ఉండేది. ఎప్పుడయితే మా ఇళ్లలో వ్యతిరేకత ఎదురయిందో అప్పటినుంచి అది ఆశయంగా మారింది’’ అని ఉద్యమం తొలినాళ్లలోని అనుభవాల్ని వివరించారు మాణిక్యమ్మ. 

ఎవరి ప్రయత్నాలు వారివి...

                             ఉద్యమం అంటే... నినాదాలు పలుకుతూ రోడ్డెక్కే మామూలు పద్ధతిని ఎంచుకోలేదు మాణిక్యమ్మ. మద్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలంతా ఒకపక్క తమ ఇళ్లలోని మగవారికి నెమ్మదిగా సర్దిచెప్పుకుంటూనే మరో పక్క అధికారులకు తమ గోడుని వెళ్ళబోసుకునేవారు.‘‘మొత్తం యాభైమంది మహిళలు నాతోపాటు నడిచారు. ముందు కలెక్టర్ని కలిసి మద్యం వల్ల మా ఊరికి జరుగుతున్న నష్టం గురించి చెప్పాం. తర్వాత ఎమ్మెల్యేని కలిశాం. మా ప్రయత్నాలు మేం చేస్తుంటే...మద్యంషాపు యజమాని తన పలుకుబడిని బట్టి తన ప్రయత్నాలు తాను చేసుకునేవాడు. ఆ పరిస్థితుల్లో ఏడేళ్లపాటు మా ఊరి మగాళ్లను, నాయకుల్ని ఒప్పించి మద్యంషాపు తీయించేశాం. ఆ పై ఏడాది ఎన్నికల్లో బీసీ మహిళా రిజర్వేషన్‌కింద నేను సర్పంచ్‌గా పోటీచేసి అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఇక అక్కడి నుంచి నా పాట్లు మొదలయ్యాయి’’ అంటూ అప్పటివరకూ ఎంతో హుషారుగా మాట్లాడిన మాణిక్యమ్మ స్వరం నెమ్మదించింది. 

ప్రలోభాలకు లొంగలేదు...

                                             అప్పటివరకూ మాణిక్యమ్మ పొదుపు సంఘాల ఈవోగా మాత్రమే పనిచేశారు... ఆమె సర్పంచ్ అవగానే కొందరు రాజకీయ నాయకులు వచ్చి ‘‘మాణిక్యమ్మా....ఇప్పుడు నువ్వు ఒక ఊరికి సర్పంచ్‌వి. నువ్వు ఏం సంపాదించాలన్నా...ఈ ఐదేళ్లలోనే. ఊళ్లో బెల్టు షాపుకి అనుమతిచ్చావనుకో...నీకే కాదు ఊరివాళ్లకు కూడా ఎంతోకొంత సొమ్ము ఇస్తారు. ఆశయాలు..ఆదర్శాలు అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్క రూపాయి కూడా నీ చేతిలో ఉండదు...ఇక నీ ఇష్టం’ అంటూ తనకు చేసిన హితబోధను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేశారు ఈ మహిళాసర్పంచ్. ‘‘మద్యం తాగేవాడి కాళ్లు పట్టుకుని, పోసేవాడి కాళ్లు పట్టుకుని....ఊరికి ఏ నాయకుడొచ్చినా మద్యం వద్దంటూ గొంతు చించుకుని అరిచి మరీ ఆ షాపు మూయించాం. ఇప్పుడు నాకు సర్పంచ్ పదవి వచ్చింది కదా అని కాసులకు ఆశపడడానికి మించిన అన్యాయం మరొకటి ఉండదనుకున్నాను. అంతేకాదు కోపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దాలనుకున్నాను. పచ్చని పంటపొలాల మధ్య మా ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలతో బతకాలనుకున్నాను. మద్యంషాపు మూయించి కోపల్లిని ఆదర్శంగా చూపించాను. ఇక మిగిలిన సంక్షేమ పనులన్నీ చిత్తశుద్ధితో చేస్తే కోపల్లికి తిరుగులేదనుకున్నాను’’ అని ఆనాడు తన ఊరికి తాను చేయదలచిన పనుల గురించి వివరిస్తున్నప్పుడు మాణిక్యమ్మ మాటల్లో ఉత్సాహం వినిపించింది. 

రాష్ట్రపతి అవార్డు...

                              ఊళ్లో మరుగుదొడ్ల నిర్మాణం, రోడ్లు, మంచినీటి సౌకర్యం, పక్కా ఇళ్లు... ఒక సర్పంచ్‌గా ఊరి అభివృద్ధికి ఏమేమి చేయాలో అన్నీ చేశారు మాణిక్యమ్మ. మండలస్థాయి సమావేశాల్లో జెడ్‌పిటిసి అధికారి మాణిక్యమ్మ అభివృద్ధి పనులకు తోటి సర్పంచ్‌లతో చప్పట్లు కొట్టించేవారు. గట్టిగా కొట్టిన ఆ చప్పట్లన్నీ మద్యం షాపుకి అనుమతినివ్వనందుకే అంటారు మాణిక్యమ్మ. 

                          ‘‘మా ఊళ్లో జరిగిన అభివృద్ధి పనులని చూసి 2011 అక్టోబర్ 25న రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. దాంతోపాటు 5 లక్షల గ్రాంట్ కూడా ఇచ్చారు. ఆ డబ్బుతో ఎస్టీకాలనీల్లో రోడ్లు వేయించాను. నిజానికి గ్రామాల్లో మహిళా సర్పంచ్ అనగానే అంతా ఆమె భర్తే చక్కబెడతాడనే భావన ఉంటుంది. నా విషయంలో మాత్రం అది జరగలేదు. నా భర్త పేరు ప్రకాశ్. పూలు అమ్ముతారు. అదే మా జీవనాధారం. నేను సర్పంచ్ అయ్యాక...ఆయన చెప్పిందొక్కటే....‘ఈ పదవి నూరేళ్లుండేది కాదు, ఉన్న ఐదేళ్ల సమయంలోనే ఊరిని ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నావో అంత చెయ్యి. ఈ ఐదేళ్లలో ప్రతి నిమిషం చాలా విలువైంది’ అని. నాకూ అలాగే అనిపించేది. అలా అనుకునే కోపల్లిని పండగ ఇల్లులా అలంకరించుకున్నాను. నాకు తోడుగా మా ఊరి మహిళలు చాలా సాయపడ్డారు. మా ఊళ్లోని పరిశుభ్రతను చూడ్డానికి 2012 జనవరిలో ఢిల్లీనుంచి ఒక బృందం వచ్చింది. ఊరంతా తిరిగి ప్రతిష్టాత్మక ‘నిర్మల్ భారత్ అభియోగ్ అవార్డు’కి ఎంపిక చేశారు’’ అని వివరించారు. 

భవిష్యత్తుపై బెంగ....

                          కోపల్లి ప్రగతి చూసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏం లాభం...ఏ ఊరు మారాలన్నా ముందు మద్యానికి దూరమవ్వాలి. పక్కనే ఉన్న అంగలకుదురు గ్రామస్తులు మాణిక్యమ్మను కలిసి మా ఊళ్లో కూడా మద్యంషాపు మూయించమని అడిగితే ఈ మధ్యనే కొందరు మహిళల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. ‘‘మా ఊళ్లో మద్యంషాపువాడు బయటికి పోడానికే ఏడేళ్లు పట్టింది. ఇక బయటి ఊరివాడు మా మాటెలా వింటాడు. ‘నీకేం సంబంధం...’అంటూ బయటికి పొమ్మన్నాడు. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వేరే ఎవరైనా సర్పంచ్‌గా గెలిస్తే మా ఊరి మద్యంషాపుకి ఎక్కడ అనుమతి ఇస్తారోనని అనుమానం. అందుకే ముందుగా మేం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించుకుంటున్నాం’’ అని చెప్పిన మాణిక్యమ్మ మనసులోని ఆవేదను అర్థం చేసుకోవాల్సింది తోటి మహిళలే కాదు... ఊళ్లోని మగవాళ్లు కూడా. ఆ మాటకొస్తే ప్రజల్ని పాలించే ప్రతి ఒక్క నాయకుడూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. 

                 మండలస్థాయి సమావేశాల్లో జెడ్‌పిటిసి అధికారి ఈ మహిళా సర్పంచ్ తన ఊరికి చేసిన అభివృద్ధి పనులకు తోటి సర్పంచ్‌లతో చప్పట్లు కొట్టించేవారు. గట్టిగా కొట్టిన చప్పట్లన్నీ మద్యం షాపుకి అనుమతి ఇవ్వనందుకే అంటారు మాణిక్యమ్మ. 

మూలం : సాక్షి దినపత్రిక 

0 Comments

ఈమె మరో మదర్ థెరిస్సా

6/27/2013

0 Comments

 
Picture
          ‘సుమనహళ్లి మదర్‌ థెరిస్సా ’గా పేరు పొందిన ఈ విదేశీ మహిళ బ్రిటన్‌ నుంచి వచ్చింది. ఒక చిన్న మోపెడ్‌ను నడుపుకుంటూ వెళ్ళే ఈ క్రైస్తవ మఠ సహోదరి, న్యూకాస్టిల్‌ నుండి వచ్చి ఇక్కడే స్థిరపడి 29 సంవత్సరాలుగా కుష్ఠురోగులకు సేవలందిస్తోంది.


            అంతర్జాతీయంగా ఒక అనూహ్యమైన గుర్తింపును పొందింది మదర్‌ థెరిస్సా. చరిత్రలో ఈమే ఈ రంగంలో అత్యంత సేవలందించి జన్మ చరితార్థం చేసుకున్న తొలి మహిళ. ఈమె కూడా విదేశీయురాలే. ఇదే మార్గంలో మరికొందరు ప్రయాణిస్తూ, థెరిస్సా అడుగుజాడల్లో నడుస్తున్నారన్నది యథార్ధం. థెరిస్సా ప్రపంచదేశాల్లో ఎందరికో ఆదర్శంగా, చెరగని ముద్రవేసుకుంది. అదే మార్గంలో పయనిస్తూ రెండో మదర్‌ థెరిస్సాగా కొనియాడబడుతోంది జీన్‌..

                  అసలు పేరు జాక్వెలిన్‌ జీన్‌ మెక్‌ఈవాన్‌. ఎక్కువ గా ఈమె ను జీన్‌ అని పిలుస్తూవుంటారు. అంతేకా కుండా జీన్‌, బెంగళూరులో ఉన్న ఈ సుమనహళ్లి వాసులకి మరో థెరిస్సాగా పేరుపడిపోయింది. ఈమె తన సుదీర్గ కాలం తరువాత ఒకమారు తన దేశానికి వెళ్ళాలని అనుకుంది. తీరా అప్పుడు చూస్తే వీసా గడువు అప్పటికే ముగిసింది. అయినా ఈమె కథ కేంద్రమంత్రి వరకూ చేరుకుంది. ఈమె కుష్ఠురోగుల వైద్య సహాయం అందించడం కోసం మొబైల్‌ వైద్యశాలని నడుపుతోంది. అంతేకాకుండా ఈమె సుమనహళ్లికి అంబులెన్స్‌లో వెళ్ళి అక్కడి కుష్ఠు రోగుల గాయాలను శుభ్రం చేసి, కట్లు కడుతున్నారు. వైద్య రంగంలో చేసిన సేవలకు ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.


                  ఒక్క కుష్ఠు వ్యాధి గ్రస్తులకు మాత్రమే కాకుండా మధుమేహం ఉన్న వారికి కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోంది జీన్స్‌. జీన్‌ మాట్లాడుతూ, ‘ఇండియాలో కుష్ఠువ్యాధి అరికట్టబడింది. అయినా పూర్తిస్థాయిలో దీనిని నివారించడానికి వైద్యులు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే, కొత్తగా మరికొందరు ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ వ్యాధిని కూకటి వేళ్ళతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ’. అంటూ తన సంతోషాన్ని వ్యక్తీకరించింది. కుష్ఠురోగులకు సేవలందించడంలో జీన్‌కు ఎంతో అనుభవం ఉంది. బెంగళూరులో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర బిక్షం ఎత్తుకునే కుష్ఠువాళ్ళను కూడా ఈమె పిలిచి తీసుకువెళ్ళి ప్రత్యేక వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఆదరణ కరువై, సమాజం దృష్టిలో అనాశ్రయులుగా ఉండే వీరి పట్ల జీన్‌ ఎంతో ఆదరణ చూపెడుతోంది. అంతేకాకుండా ఎంతో శ్రద్ద కూడా కనబరుస్తోంది.


భారతీయ వ్యవహారాల్లో...
              ఈమె ఇండియాలో జరుగుతున్న డ్రగ్‌ మాఫియా, ముఠాతగా దాలు, మద్యపానం, ఇతర వ్యసనాల మీద, వారికి సంబంధించిన అంశాల మీదా ఎంతో విచారాన్ని వ్యక్తప రిచింది. హిందూ-ముస్లింలు భారతదేశంలో సఖ్యతగా ఉండడాన్ని గమనించి ఎంతో సంతోషాన్ని తెలియ చేసింది. తను కుష్ఠువ్యాధి గ్రస్తులకు, ఇతర రోగులకు సేవలందించడం ద్వారా బాధ అనేది ఎలా ఉంటుందో బాగా తెలిసింది అంటుంది. ఈమె ఈ సేవలు అందించడానికి ఎక్కువగా న్యూకాజిల్‌ నుండి ధన సహాయం అందిందని కృతజ్ఞతా భావంతో అంటుంది. తప గురించి, తన సేవల గురించి పత్రికల్లోను, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోను రావడం తనకెంతో ఆనందం కలిగించినట్టు తన మాటల్లోనే వ్యక్తపరిచింది.నేటి యువత కొందరు అవగాహనా రాహిత్యంతో నడుచుకోవడం పట్ల ఈమె ఆవేదన వ్యక్తంచేసింది. సమాజంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఎంతో కృషి చేయాలని, అందుకు సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు తగిన సత్వర చర్యలు చేపట్టాలని సలహాయిచ్చింది.


వ్యవస్థాపన...
               ఈమె స్థాపించిన సుమనహళ్లి సొసైటీ సుమారుగా 120 మంది పేద కుష్ఠు రోగులకు ఆశ్రయాన్ని కల్పించేదిగా ఎంతో విశాల ప్రదేశంలో నిర్మించింది. తన మొబైల్‌ సేవల ద్వారా సుమారుగా నిత్యం 1000 మంది కుష్ఠు రోగులకు సేవలందిస్తోంది. జీన్‌ చేస్తున్న ఈ అనుపమాన సేవలకు, తోటి నన్స్‌కి ఇచ్చిన ట్రైనింగ్‌ కార్యక్రమాలకు గుర్తింపుగా ఎన్నో అవార్డ్‌లు, పురస్కారాలు అందుకుంది. అదే కోవలో ఈ సొసైటీకి ఎందరో ప్రముఖులు, పెద్దపెద్ద సంస్థలు, సేవా నిరతి ఉన్న అనేక మంది వ్యక్తులు ఎన్నో విరాళాలు స్వయంగా అందించారు. ఈ మిషన్‌ని 70ల్లో స్థాపించడం జరిగింది.


                ఈ సోసైటీ ద్వారా ఈ గ్రామం కూడా దినదినాభివృద్ది చెందుతూ వచ్చింది. ఈరోజు సుమనహళ్లిలో ఈ మిషన్‌లో కుష్ఠురోగులు తయారుచేస్తున్న తోలు ఉత్పత్తులు, దుస్తులు, ఇతర వ్యాపార వస్తువులు యునైటెడ్‌ కింగ్ డమ్ లో  విరివిగా అమ్ముడుపోతూ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నాయి.జీన్స్‌ బెంగుళూరులోని నది తీరాన ఎంతో ఆహ్లాదంగా ఉండే కామరాజ్‌ అనే ఈ ప్రదేశానికి చాలా సంవత్సరాల క్రితం వచ్చారు. బజ్‌ ప్రాంతంగా పిలువబడే ఊరి చివరి ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద పెట్రోల్‌ పంపుల వద్ద చాలా పెద్ద భవంతి నిర్మాణము చేస్తున్నారు. ఆమె టివిఎస్‌ మోపెడ్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం దానిని ఒక మూల ఉంచారు. ఇది ఆమెకు నాల్గవ వాహనం. 2000 సంవత్సరం నుండి ఈమె టివిఎస్‌ వాహనం పైనే తన పనులు చేసుకుంటోంది.

మూలం : తెలుగు విశేష్

0 Comments

విజయోత్సవ నృత్యం

6/26/2013

0 Comments

 
Picture
                 తాత గారి పేరు కోకా కోటయ్య. నాన్నమ్మ శ్రీమతి మహలక్ష్మీ. వారికి ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. విజయలక్ష్మి తండ్రి రాధాకృష్ణ మూర్తి రెండవ సంతానం.విజయలక్ష్మి తండ్రి ప్రాథమిక విద్యాభ్యాసమంతా సొంతవూరు రావూరు లోను, డిగ్రీ బాపట్లలోను చేశారు. ఆ రోజుల్లో ఆమె తండ్రి గొప్ప కబాడ ఆటగాడిగా పేరు తెచ్చుకొన్నారు. అంతేకాదు... వారి మిత్రులతో కలిసి టీము ఏర్పాటు చేసుకొని, చెన్నై, విజయవాడ వంటి ఫలు నగరాలలో కప్పులు గెలుచుకొచ్చేవారట. కాలేజి సెలవుల్లో నాన్నగారు బాపట్లనుండి రావూరు వెళ్ళితే, రాధా వచ్చాడని చుట్టుపక్క గ్రామాల వారొచ్చి చూసివెళ్ళేవారట. కబాడి ఆటగాడిగా నాన్నగారికి ప్రజల్లో అంత క్రేజ్‌ వుండేది.

                  తల్లి పేరు సామ్రాజ్యం. అమ్మ నాన్నలకు విజయలక్ష్మితో సహా ముగ్గరు సంతానం.విజమలక్ష్మి పెద్ద అమ్మాయి. ఒక చెల్లి, తమ్ముడు వున్నారు. చెల్లి పేరు శిరీష, తమ్ముని పేరు మదన్‌ కుమార్‌. కుటుంబ సభ్యులు చాలా ప్రేమగా చూసుకునేవారంటారు ఆమె. అయితే అచారాలు, మర్యాదలు అనే కట్టు దిట్టమైన వాతవరణంలో విజయలక్ష్మి నాన్నగారు పెరగడం వల్ల చాలా పద్ధతిగా పెంచారు. చెల్లి, తమ్ముడు చదువుల్లో చురుగ్గా వుండడం వల్ల, వారిని చదువుల్లో ఎంకరేజ్‌ చేశారు. తన విషయంలో మాత్రం ఆమెను ఒక గొప్ప కూచిపూడి డాన్సర్‌గా చూడాలని తపన పడేవారట. అందువలన తన అయిదవయేటనే కూచిపూడి నేర్పించడం మొదలెట్టారు. నాన్నగారికి వృత్తి రీత్యా ఎక్కువ బదిలీలుండేవి. ఏ వూరికెళ్ళినా, మొదట ఏ స్కూల్లో కూచిపూడి నేర్పుతారు, లేదా ఎక్కడ కూచిపూడి నేర్పుతారు అని తెలుసుకొని, అందుకనుగుణంగా స్కూల్లో చేర్పించడం లేదా ఇళ్ళు తీసుకోవడం చేసేవారు. 

                విజయలక్ష్మి డ్యాన్సు పోటీల కెళ్ళినప్పుడల్లా తల్లి ఆమెకు తోడుగా వచ్చేది. తండ్రి ఎపుడూ ఆమెను ప్రోత్సహించేందుకు ఒక మాటంటూవుండేవారట... గెలుపోటమల ప్రభావం పట్టించుకోకుండా చేసే పనిని చిత్తశుద్ధితో చేయడమే విజయానికి ముఖ్యమని.... తండ్రి రిటైర్డు అయిన తరువాత, కొంతమంది బంధువులు వచ్చి, ఆశలు చూపి నాన్నగారి సేవింగ్సు, మొత్తం వారి వ్యాపారాలలో చేయించారు. అయితే నమ్మిన బంధువులే నష్టాలు వచ్చాయిని చెప్పడం వలన మొత్తం డబ్బులు కోల్పోయి, జీవనోపాధి కొరకు తిరిగి జాబు చేయవలసి వచ్చింది. విజయలి మొదటిసారి సింగపూరులో డాన్సు ప్రోగ్రాం కెళ్ళి వచ్చినపుడు నాన్నగారు చాలా సంతోషించారు. తన కోరిక తీరినట్లుగా భావించారు. తరువాత దుబాయిలో ప్రోగ్రాం చేసి వచ్చిన కొద్ది రోజులకే దూరమయ్యారు. తాను డాన్సు నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుండి బంధువులందరూ నీకిష్టమై డాన్సు నేర్చుకొంటున్నావా, లేదా మీ నాన్నగారి వల్ల నేర్చుకొంటున్నావా అని యక్ష ప్రశ్నలతో విసింగించేవారు.

                  కొందరు చులకనగా చూసేవారు. అలా విమర్శించినవారే... దేశ విదేశాలలో తాను చేసిన ప్రొగ్రామ్స్‌ గురించి తెలుసుకొని ఇప్పుడు గౌరవిస్తున్నారంటారామె. తన తండ్రి కోసం ఏదో చేయ్యాలనే తపన నిరంతరం మదిలో తొలిచేది. చివరికి అది ఒక సంస్థగా వెలిసింది. ఈ సంస్థ కేవలం వినోదాత్మకమైన నృత్య ప్రదర్శనలే కాక, నేటి సమాజిక సమస్యలు గురించి తెలుపుతూ, మనోవికాసానికి తోడ్పడే ప్రయోగాత్మక ప్రదర్శనలేన్నో ఈ సంస్థ ద్వారా చేస్తున్నాం. వీటిలో సమైక్య భారతి, తెలుగు ప్రశస్తి, భారతీయ మరియు ఫ్రాన్స్‌ సంస్కృతుల మేళవింపుగా చేసి మెలెంజె డాన్సు ప్రదర్శనలు చాలా ముఖ్యమైనవి. తెలుగు భాషకు ప్రాచీన వైభవం లభించిన సందర్భంగా, తెలుగు ప్రశస్తి గురించి తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తరపున, భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో ప్రదర్శనలివ్వడం తన కెంతో గర్వకారణం అంటారామె. అంతేకాదు...ఈ ప్రోగ్రాములు తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో చేయడం వల్ల తనకు మరింత ఆనందం అంటారు విజయలక్ష్మి.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

వికలాంగులకు దారి చూపుతున్న జయశ్రీ 

6/24/2013

3 Comments

 
Picture
              వికలాంగులంటే అందరిలా పనిచేయలేని వారు అనా? కాదు, అందరూ చేసే పనిని, అందరూ చేసే పద్ధతిలో కాకుండా మరో మార్గంలో చేసేవారు. అందుకే జయశ్రీ వారిని డిజేబుల్డ్ అనరు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు. భిన్న మార్గంలో పనిపూర్తి చేయగలిగిన వారంటారు. ఈ జయశ్రీ ఎవరు ? సమాజానికి ఒక ఆదర్శనీయ మార్గం చూపాలని ఎందుకు అనుకున్నారు?

               ప్రతి మనిషికీ ఈ సమాజం నుంచి ఒకే రకమైన సహకారం అందదు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ న్యాయం జరుగుతుంటుంది. నిజానికి వికలాంగులకు దేవుడు అన్యాయం చేశాడు అనుకుంటారు కాని వారికి నిజంగా అన్యాయం చేసేది సమాజమే. ఎందుకంటే వారికి వికలత్వం ఉన్నా కూడా సాధారణ వ్యక్తులతో పోటీ పడగల అదనపు సామర్థ్యాలను దేవుడు ప్రసాదించాడు. కానీ, సమాజం మాత్రం సహకారం మానేసి సానుభూతి చూపుతుంది. జన జీవన స్రవంతిలో కలుపుకోవడం మానేసి జాలి చూపుతుంది. ‘మాపై జాలెందుకు?’... ఇదీ ఇటీవల వారిలో వస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నను సంధించే ప్రతినిధిగా ముందుకు వచ్చారు జయశ్రీ రవీంద్రన్.

                   కేరళలోని పాలక్కాడ్ ఆడపడుచు జయశ్రీ. చెన్నైలో జాబ్ చేసుకుంటున్న జయశ్రీకి వికలాంగులను ఈ సమాజం చూస్తున్న కోణం నచ్చలేదు. తనకు సరిగా వినపడకపోవడం వల్ల తనలాంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సులువుగా అర్థమయ్యాయి. అందుకే ఆ కోణాన్ని సమూలంగా మార్చివేయాలను కున్నారు.అంతే, ఉద్యోగం పక్కనపెట్టి వారికోసం నిలబడ్డారు. ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేసిన జయశ్రీకి ప్రపంచమంతటా పరిస్థితి ఎలా ఉందో, మనదేశంలో అలా లేదన్న సంగతి అర్థమైంది. ముందు తానేం చేయగలదో తెలుసుకుంటే, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. అందుకే ముందుగా ‘ఎబిలిటీ’ ఫౌండేషన్ నెలకొల్పారు. డిఫరెంట్లీ ఏబుల్డ్‌కు ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి ‘ఎబిలిటీ’ సిద్ధంగా ఉంటుంది. ఆ సంస్థ తరఫున తమలాంటి వారి శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. ఆ మార్గంలో పుట్టుకొచ్చిందే ‘ఎబిలిటీ’ పత్రిక. సమాజం వికలాంగులు అనుకుంటున్నవారు ఎంత సమర్థులో, వారు సాధిస్తున్న విజయాలేంటో కళ్లకు కట్టే పత్రిక ఇది. వారు అవకాశాలిస్తే ఎదిగేవారే కాదు, అవకాశాలు సృష్టించుకునేవారు, సృష్టించేవారని నిత్యం చాటే పత్రిక ఎబిలిటీ. ‘అయినా ఈరోజుల్లో శారీరక శ్రమకు చోటెక్కడుంది? ఉన్నదంతా మేధో శ్రమే. అందులో మేము ఎవరికీ తీసిపోం, పనిచేసేది శరీరం కాదు, ఆలోచనే!’ అంటారు జయశ్రీ.


ఎందెందు చూసినా..

            ఎబిలిటీ ఫౌండేషన్ ఏ ఒక్క పనికో పరిమితం కాలేదు. దేశంలోనే ‘ఎంప్లాయబిలిటీ ’ అనే ఓ కొత్త ప్రక్రియకు తెరలేపింది. నౌకరీ, కెవిన్‌కేర్, పీఎన్‌బీ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థల సహకారంతో కేవలం వికలాంగుల కోసమే ఏర్పాటుచేసిన ఉద్యోగ మేళా ఇది. ఈ మేళా తరచుగా జరుగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ వ్యక్తులు ఇందులో పాల్గొని తమ సామర్థ్యాలు నిరూపించుకుంటే, మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. చెన్నైలో 2004లో జరిగిన తొలి ఉద్యోగ మేళాలో 36 కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్నాయి. తర్వాత వీటి సంఖ్య, అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొద్దిరోజుల క్రితమే హైదరాబాదులో కూడా ఈ జాబ్ మేళా జరిగింది. జాబ్ ఫెయిర్‌కు వస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ వారు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌లో ఈ ఏడాది నిర్వహించినట్లు చెప్పారు జయశ్రీ.కేంద్ర ప్రభుత్వం చేసిన ‘పర్సన్స్ విత్ డిజేబిలిటీ 2011’ చట్టం రూపకల్పనలో జయశ్రీ కీలక పాత్ర పోషించారు. వికలాంగుల కోసం ఫిల్మ్ ఫెస్టివల్ (పాత్రలు, పాత్రధారులు, రూపకర్తలు వారే), వారికోసం ఒక రేడియో, ప్రత్యేక రేడియో కార్యక్రమాలు, వారికోసం ప్రత్యేకమైన అవార్డులు... ఇవన్నీ జయశ్రీ సృష్టించిన ఓ కొత్త ప్రపంచంలో భాగం.
‘మాకు తెలుసు మేము సమర్థులమని, మీరూ తెలుసుకోండి’ అని ఆమె తన చేతలతో నిరూపించారు.

మూలం : తెలుగు విశేష్

3 Comments

సమస్యలను మించి పరుగు

6/24/2013

0 Comments

 
Picture
పదుల సంఖ్యలో పతకాలు సొంతం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు
ఆరోగ్యం సహకరించకున్నా బరిలోకి దిగేది
పలు రివార్డులు, అవార్డులు సొంతం 


పరుగు పెట్టిందంటే ఆమె చిరుతను గుర్తుకు తెస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో పతకాలు సాధించిన క్రీడాకారిణి. విదేశాలకు వెళ్లినప్పుడు వాతావరణం పడక శరీరం సహకరించేది కాదు. అయినా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. పోరాట పటిమకు అవార్డులు, రివార్డులు ఎన్నో వరించాయి. పరుగుల చిరుతగా పేరుపొందిన అనురాధ బిశ్వాల్‌. గురించి.... 

భారతదేశంలో ఇండియన్‌ ట్రాక్‌ ఫిల్డ్‌ అథ్లెట్‌ క్రీడలో గుర్తింపు పొందిన క్రీడాకారిణి అనురాధ బిశ్వాల్‌. ఒడిశా నుంచి ప్రత్యేకంగా 100 మీటర్స్‌ హర్డిల్స్‌ క్రీడలో రాణించారు. ఇప్పటి వరకు 100 మీటర్స్‌ హర్డిల్స్‌లో ఆమె రికార్డు జాతీయంగా 13.38 సెకెండ్స్‌ రావడంతో చరిత్ర సృష్టించారు. ఈ రికార్డును బిశ్వాల్‌ అగస్టు 26, 2002లో డిల్లీలో నెహ్ర స్టేడియంలో జరిగిన డిడిఎ రాజా భాలేంద్ర సింగ్‌ జాతీయ సర్క్యూట్‌లో ఈ ఘనత సాధించారు.అనురాధ బిశ్వాల్‌ 2000 సంవత్సరంలో జర్తాలో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌ షిప్‌లో 13.40 సెకెండ్స్‌లో 100 మీటర్లు పూర్తి చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జకర్తాలో బిశ్వాల్‌ అత్యుత్తమ ప్రదర్శనకు బ్రోంజ పతకాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఒడిశాలోని భువనేశ్వర్‌లో నాల్కో(ఎన్‌ఎఎల్‌సిఒ)లో జూనియర్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. 

ఎంబిఎ, యంఎలో ఎల్‌ఎల్‌బి కూడా పూర్తి చేశారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సమయంలో అనేక సమయల్లో సమస్యలు వచ్చేవి, కానీ వాటిని లెక్కచేయకుండా లక్ష్యం కోసం ముందుకు సాగేది. ఇతర దేశాల్లో క్రీడల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు శరీరం సహకరించేది కాదు అయినా పట్టు వదలకుండా పోరాట పటిమను కనబరిచేది. చిన్న వయస్సు నుంచి కోచింగ్‌లో మంచి నైపుణ్యంతో ముందుకు సాగడంతో పలు పతకాలు ఆమెకు అందివచ్చాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి గ్రౌండ్‌లో ఉండేవారు. ఎన్ని సమస్యలు వచ్చినా శిక్షణకు మాత్రం దూరం కాలేదు. ఎందుకంటే ప్రతి విజయం వెనుక ఎంతో కష్టం ఉంటే తప్ప సొంతం కాదని ఆమె నమ్మేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో కష్టపడేవారు. ప్రతి విజయం వెనుక తల్లిదండ్రులు రవీంద్రనాథ్‌, నిబేధిత పాత్ర కీలకం. వారు సహకరించకుంటే ఇంతటి విజయాలు నా పేరిట ఉండేవి కాదంటున్నారు 

అనురాధ బిశ్వాల్‌. మనదేశంలో ఎక్కడ ఈవెంట్‌ జరిగినా తనను ప్రేక్షకులు ఎంతో ఆదరించేవారని చెబుతారు. శిక్షణ ఇచ్చిన శిక్షకులు ‘ముందుగానే నీలో విజయం కనిపిస్తుంది’ అని ప్రోత్సహించేవారు.రెట్టించిన ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొనేవారు. పంచాయన్‌ గంటయాత్‌, అరుణ్‌కుమార్‌ దాస్‌, యూరి అలెక్సండర్‌ వంటి వారి వద్ద పరుగులో మెళకువలు నేర్చుకున్నారు.
శిక్షణలో భాగంగా మొదట రూర్కేలాలోని పంచాయత్‌ గంటయాత్‌ దగ్గర కోచింగ్‌ తీసుకున్నారు. దగ్గరలో సాయి హోటల్‌ల్లో నివాసం ఉంటూ చాలా సంవత్సరాలు అక్కడే గడిపారు.

అవార్డులు

2000లో ఏషియన్‌ చాంపియన్‌ షిప్‌ జకర్తాలో మూడవ స్థానం సాధించారు.
2006లో శాఫ్‌ గెమ్స్‌ శ్రీలంకలో జరిగిన క్రీడలో మొదటి స్థానం సాధించారు. 
అంతేకాకుండా బింజు పట్నాయాక్‌ స్పోర్ట్‌‌సపర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకున్నారు. 
80 బంగారు పతకాలు, 50 సిల్వర్‌ పతకాలు, 37 బ్రోంజ పతకాలను సొంతం చేసుకున్నారు. 
పతకాల వివరాలు
1987లో జలందర్‌లో జరిగిన 15 మంది మహిళ 100 మిటర్స్‌ హర్డిల్స్‌లో బంగారు పతకం సాధించారు. ఆ తరువాత 1995లో ఇతర గ్రూప్‌లతో పోటిపడి జాతీయ ఛాంపియన్‌ షిప్‌ను గెలుపొందారు. 
1998లో కలకత్తాలో జరిగిన 100 మీటర్స్‌ హర్డిల్స్‌లో సిల్వర్‌ పతకాన్ని సాధించారు. 
1999లో మూడు రాష్ట్రాల్లో జరిగిన 100మీటర్స్‌ హర్డిల్స్‌ ఈవెంట్‌లలో మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మణిపూర్‌లలో జరిగిన అన్ని ఈవెలంట్‌లలో బంగారు పతకాలు సాధించడం గమనార్హం. 
2000లో చెనై్న, లక్నోలో జరిగిన ఈవెంట్‌లలో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. 
2001లో లూదియానా, చెనై్నలలో జరిగిన 100 మీటర్స్‌ హర్డిల్స్‌లో బంగారు పతకాలు సాధించారు. 
2002లో హైదరాబాద్‌, న్యూఢిల్లీలో జరిగిన 100 మీటర్స్‌ ఈవెంట్‌లలో రికార్డ్‌ స్థాయిలో బంగారు పతకాలు సాధించారు. 
2005, 2006 ,2007, 2008, 2009,2010 సంవత్సరాలలో పలు బంగారు, వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయస్సులో చాలా ఎక్కువ పతకాలు సాధిచండం విశేషం. 
అంతర్జాతీయంగా కూడా అనేక మ్యాచ్‌లలో రాణించి పలు పతకాలు సాధించండం గమనర్హం.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

హిమ శిఖర కీర్తి

6/24/2013

0 Comments

 
Picture
             వెంపటి చినసత్యం మాస్టారు గారి దగ్గర కూచిపూడి నాట్యములో శిక్షణ పొంది ప్రావీణ్యులైన విద్యార్ధినీ విద్యార్ధులలో ఎంతో మంది భారత దేశంలోనే కాకుండా అమెరికా, ెకనడా వంటి దేశాలలో కూడా స్థిరపడి తమకున్న ప్రతిభను, క్రమశిక్షణను నవతరం వారికి పంచి ఇస్తూ, మంచి స్వభావముతో మనసును ఆకొట్టుకొంటూ ఆ కళ అడుగంటిపోకుండా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారిలో భారతదేశంలో పుట్టి లాస్‌ ఏంజిల్‌కి తరలివచ్చిన కళాకారిణి... ఫ్రీమౌంట్‌, కాలిఫోర్నియాలో నివసిస్తున్న హిమబిందు చల్లా....

                    1996వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలి లాస్‌ ఏంజిలిస్‌కి వలస వచ్చారు. అక్కడ ఆరు సంవత్సరాలు వున్న తరువాత కొంతకాలం మాంట్రియల్‌, కెనడాలో నివసించి 2003 నుండి ఫ్రీమౌంట్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. భర్త దేవకుమార్‌ మన్నెల. హాలీవుడ్‌ మూవీస్‌కు సంబంధించి స్పెషల్‌ ఎఫెక్ట్‌‌స డివిజన్‌లో ఉద్యోగస్తులు. ఇద్దరు మగ పిల్లలు విక్రాంత్‌... విఘ్నేశ్‌. 2004లో సిలికానాంధ్ర నిర్వహించిన తెలుగుతేజం ద్వారా బే ఏరియా లో అందరికీ సుపరిచతమయ్యారు. అదే సంవత్సరములో నృత్యానంద పేరుతో ఒక నాట్య కళాశాలను ప్రారంభించారు. హిమబిందు వద్ద అప్పట్లో సుమారు 30 మంది విద్యార్ధినీ విద్యార్ధులు నాట్యం నేర్చుకున్నారు. హిమబిందు చాలా చిన్న వయసులోనే నెల్లూరులో తల్లితండ్రులు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి చేర్పించారు. 

                    అమ్మ పేరు సులోచన, తండ్రి పేరు శివరామి రెడ్డి. కాంట్రాక్టు బిజినెస్‌ ఆయనది. ఆ తరువాత కొంతకాలానికి మద్రాసులో స్థిరపడ్డాక తల్లితండ్రులు మాస్టారు దగ్గర చేర్చడానికి ప్రయత్నిస్తే ఆయన వయసు ఎనిమిది సంవత్సరాలన్నా ఉండాలని చెప్పారు.దాంతో తిరిగి పది సంవత్సరాల వయసులో వచ్చి అకాడమీలో చేర్చారు. అది తన జీవితములో ఒక మరపురాని ప్రయాణమని, ఒక గోల్డెన్‌ చాప్టెర్‌ అని వర్ణించారు. ఆయన అకాడమీలో చేరిన వారికి ఎవరికయినా నాట్యం మీద మక్కువ, క్రమశిక్షణ కూడా దానంతట అదే అలవడుతుందన్నారు. అంతేకాకుండా కొత్తగా చేరిన వారు తమ కన్నా ముందే చేరిన వారి దగ్గర చూసి నేర్చుకోవడం ఒక అభ్యాసన అని చెప్పారు. 

                        హిమబిందు కూడా తన మాస్టారు గారి చిన్న కొడుకయిన రవి నాట్యం చేస్తుండగా చూసి ఎంతో నేర్చుకున్నారని, ఆయనను అనుకరించడానికి ఎంతో ప్రయత్నించారని చెప్పుకున్నారు. స్కూలు నుండి ఇంటికి రాగానే హోం వర్కు పూర్తి చేసుకుని పదిహేను నిముషాల దూరంలో ఉన్న అకాడమీకి సైకిలు మీద వెళ్ళేవారట. అక్కడికి వెళ్ళగానే అందర్నీ చూసి ఎంతో అనందం కలిగేదని, రెండు బ్యాచీలుగా క్లాసులు జరిగేవని, తమ వంతు వచ్చే వరకు వేచి చూసి ఆ తరువాత ఎంత సేపు నేర్చుకున్నా అలసట అనేది లేకుండా ఎంతో ఉత్సాహంగా కూడా ఉండేదన్నారు. 

                         నాట్యం ఎవరికి వారు తమంతట తాము నేర్చుకోవడం కన్నా నాట్యం చేస్తున్న వారిని పరిశీలించటం అక్కడి విద్యార్ధులకు చక్కటి ఆచరణ అన్నారు. అకాడమీలో ప్రొద్దున మాస్టారు, సాయంత్రం సీనియర్‌ విద్యార్ధులు క్లాసులు తీసుకొనే వారని, ఒక్క శని,ఆది వారాలలో మటుకు ప్రొద్దున మాస్టారు గారు చెప్పే క్లాసులో నేర్చుకునే భాగ్యం కలిగేదని ఆవిడ అన్నారు. ప్రతివారు మాస్టారు గారి నుండి మెప్పుదల పొందాలని, అందరిలోను ఆధిక్యతగా ఉండడానికి ఎంతో ప్రయత్నించే వారని ఆవిడ అన్నారు. ఆయన ఒక విద్యార్ధిని మెచ్చుకోవటం చాలా అరుదని కూడా అన్నారు. 

                              ఆయన అలా చేయకపోవటం వలన విద్యార్ధులకు ఇంకా బాగా నేర్చుకోవాలనే తపన, పట్టుదలే అక్కడి విద్యార్ధినీ విద్యార్ధులకు ఒక గట్టి పునాది వేసిందన్నారు. 1998లో మాస్టారు గారు అకాడమీని అడయారుకు మార్చేటప్పటికి, ఇంటికి దూరమయ్యిందని, మాస్టారు గారి సీనియరు విద్యార్ధిని అయిన సత్యప్రియ రమణ గారి దగ్గర నాట్యము కొనసాగించవలసి వచ్చింది. సత్యప్రియ గారు నాట్యానికి బాగా అంకితమయిన వ్యక్తి. ఆవిడ దగ్గర నేర్చుకుంటున్న సమయంలో తనకు ఎన్నో సోలో డాన్సెస్‌ చేసే అవకాశం లభించిందన్నారు, అలాగే కూచిపూడిలోని అడ్వాన్స్‌డ్‌ అయిటమ్స్‌ అన్నీ కూడా అవిడ దగ్గరే నేర్చుకోవటం జరిందని అన్నారు. హిమ గారు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో వేరే పిల్లలకు నేర్పే అవకాశం కూడా కలిగిందని చెప్పారు. 

                          కానీ యేదన్నా ప్రదర్శనలు ఇవ్వవలసి వచ్చే సమయంలో మటుకు మాస్టారు గారి అకాడమీలోనే రిహార్సల్స్‌ జరిగేవని అన్నారు. హిమబిందు నాట్యంతో పాటు సంగీతం, వీణ కూడా నేర్చుకున్నారు. ఆవిడ అబివృద్దికి తల్లితండ్రులే దోహదకారకులని, వారి ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని, వారికి తాను జీవితాంతం కృతజ్ఞురాలినని అన్నారు. సత్యప్రియగారు ఎంతో స్నేహ స్వభావురాలని, మాస్టారుగారు తనకు దేవుడితో సమానమని పేర్కొన్నారు. తాను ఎన్నడూ మరచిపోలేని ఒక గొప్ప అనుభవాన్ని ఇలా చెప్పారు... ఒక సారి నాట్య ప్రదర్శనలో శివుడి పాత్రను పోషించినపుడు మాస్టారు గారు తనను దీవించి ఎంతో ప్రేమగా వీపు మీద తట్టారని చెప్పారు. ఆయన తన క్రియలు మాటల్లో కన్నా చేతల్లో ఎక్కువగా కనిపించేవని, చూపించే వారని అన్నారు. 

                       ఆవిడ ప్రారంభించిన నృత్యానంద నాట్య కళాశాలలో కూడా మాస్టారు గారి అకాడమీలో వారు పొందిన క్రమశిక్షణ, తన విద్యార్ధినీ విద్యార్ధులకు ఆ అదరణ కూడా లభించేటట్లు చేస్తానని ఆవిడ అన్నారు. తనను ఎంతో ప్రోత్సహించి ఒక కళాకారిణిగా రూపుదిద్దిన తన తల్లితండ్రులకు, మాస్టారు గారికి, సత్యప్రియరమణ గారికి, ఇప్పుడు చేయూతనిస్తున్న తన భర్తకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపకుంటు న్నాన న్నారు.

                         హిమబిందు గారు మాస్టారు గారి రూపకల్పనలో ప్రదర్శించిన ఎన్నో నృత్య నాటకాలలో పాత్రధారు లయ్యారు. ఉదాహరణకు 1996 చెన్నయ్‌లో ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణంలో శివుడిగా, అర్ధనారీశ్వరంలో సింధూనదిగా, శాకుంతలంలో గౌతమిగా మరియు ఇన్వొకేషన్‌ డ్యాన్సులో... 1998 అమెరికా టూర్‌ కి వచ్చినపుడు మేనకా విశ్వామిత్రలో ధరణీదేవిగా, అలాగే 2002లో అట్లాంటా, డెట్రాయిట్‌, పిట్స్‌ బర్గ్‌ పట్టణాల్లో మరలా మేనక విశ్వామిత్ర ప్రదర్శిం చినపుడు విశ్వామిత్రుడిగా, ఇంకా 2005లో పసుమర్తి వేంకటేశ్వర శర్మ గారి మహిషాసుర మర్ధిని నృత్య నాటికలో శివుడిగా నటించే అవకాశం కలిగిందని ఆవిడ చెప్పారు.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

ఆమె.. అడవికే ‘అమ్మ’!

6/24/2013

0 Comments

 
Picture
                ఒడిషాలోని సీనపల్లి అటవీప్రాంతానికి వెళితే అక్కడ గొడ్డలి పట్టుకొని ఓ 55 ఏళ్ల గిరిజన మహిళ అడవిలో ఒంటరిగా తిరుగుతూ కని పిస్తుంది. ఆమె చేతిలో ఉన్న గొడ్డలి చూసి ఎవరైనా భయపడతారు. ఆమె పేరు హరదే మిజ్హి.


                11 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పెద్ద పెద్ద వృక్షాలతో అలరారే ఆ అటవీ ప్రాంతాన్ని‘ కప్సి దొంగార్’ అంటారు. ఆ అడవి ఆమెకు ఆరో ప్రాణం. అది పచ్చదనంతో ఇంత సురక్షితంగా ఉందంటే అందుకు ఆమే కారణమని అటవీ అధికారులు సైతం ఒప్పుకుంటారు. వేటగాళ్లు, అడవి దొంగలు, కలప మాఫియా కళ్లెపుడూ ఆ అటవీ సంపదపైనే. వారి బారి నుంచి అడవిని కాపాడుతూ ఆమె తన కన్నబిడ్డలా సాకుతోంది. ‘‘చెట్లను రక్షించండి అవి మనల్ని రక్షిస్తాయి’’ అనే నినాదం చదువుకున్న వారే సరిగా పాటించక, ఇష్టానుసారంగా చెట్లను నరికేస్తున్న ఈ రోజుల్లో ఏ చదువులేని ఆ గిరిజన మహిళ మాత్రం ఆ నినాదం గురించి తెలియకపోయినా చక్కగా ఆచరణలో పెడుతోంది. ఇది తన భర్త ఇచ్చిన ఆస్తి అని చెబుతోంది. మజ్హి భర్త కూడా ఈ అడవిని కలప మాఫియా బారి నుంచి రక్షిస్తూ ప్రాణాలు వదిలాడు. పెళ్లయిన కొత్తలో భర్త రోజూ కూలి పనికి వెళ్లి డబ్బు సంపాదించకుండా లాఠీ పట్టుకొని అడవిని సంరక్షించటం ఆమెకు నచ్చేదికాదు. అడవి సురక్షితంగా ఉంటేనే మనకు అన్నం దొరుకుతుందని భర్త చెబితే ఎగతాళి చేసేది. విచక్షణా రహితంగా చెట్లను నరికేసి అక్రమంగా తరలిస్తున్నందున సర్వం కోల్పోయ నిరాశ్రయులవుతామనే విషయం ఆమెకు కొద్దిరోజుల్లోనే ఆర్థమైంది. ఆ అడవినే నమ్ముకుని నివసించే గిరిజనుల్లో దాదాపు 65 శాతం మందికి ఆ భూమిపై హక్కు లేకపోయినప్పటికీ రాగి, జొన్నలు పండించుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ సంపదను సంరక్షించుకోకపోతే అడవి స్మగ్గర్ల పాలవుతోందని తెలుసుకుంది. అందుకే గొడ్డలి చేతబట్టి ఆమె కార్యరంగంలోకి దిగింది. ఓ రోజు రాత్రి అడవి కాపలాకు వెళ్లిన ఆమె భర్త అనంగ్ కనిపించకుండా పోయాడు. చుట్టుప్రక్కల వారి సాయంతో అడవంతా గాలించగా తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న భర్త కనిపించాడు. చెట్లను నరికే కలప దొంగలు అతడిని తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. సకాలంలో వైద్యం అందక అతను ప్రాణాలు వదిలాడు. ప్రాణాలు వదులుతూ అడవిని రక్షించమని భార్య నుంచి మాట తీసుకున్నాడు. ఆడదానివి అడవిని నువ్వేం రక్షిస్తావని అంతా ఎగతాళి చేసినా ఆమె పట్టువీడలేదు. దినచర్యలో భాగంగా తెల్లవారుజామునే గొడ్డలి చేతబట్టి గంటసేపు అడవంతా తిరిగివస్తుంది. చుట్టుప్రక్కల ఇళ్లలో పనిచేసి వారిచ్చే జీతంతో ఇద్దరు ఆడపిల్లలను పెంచి పెళ్లి చేసింది. కొడుకు కూడా చేతికి అందివచ్చాడు. గత 30 ఏళ్లుగా ఆమె అడవికి కాపాలా కాస్తోంది. ఒక్కొక్కసారి రాత్రివేళ అడవిలోనే ఉంటుంది. 2001 తరువాత అటవీశాఖ ఏర్పాటు చేసిన వనసంరక్షణ సమితికి ఆమే నాయకురాలు. ఆమె సేవలను గుర్తించి ఒడిషా ప్రభుత్వం 2010-11లో ‘ప్రకృతి బంధు’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆమె జీవనోపాధికిగానూ అటవీశాఖ 2వేల రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తోంది. వృక్షాలనే తన బిడ్డలుగా చూసుకుంటూ కాపలా వృత్తిలో కాలం వెళ్లదీస్తోంది. ఆమె ప్రకృతిని ప్రేమిస్తుంది, ఆ ప్రకృతే ఆమెను కాపాడుతుందని కరియార్ జిల్లా అటవీ అధికారి శరత్ చంద్ర పండా అంటారు. ఆమె నిబద్ధత మిగతా వనసంరక్షణ సమితులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అటవీ అధికారులు ప్రశంసిస్తుంటారు. 

మూలం : ఆంధ్రభూమి 

0 Comments

రాజకీయ రచయిత్రి

6/21/2013

0 Comments

 
Picture
రెండు రంగాల్లో రాణిస్తున్న వ్యాస్‌
ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా సేవలు
1985లో కాంగ్రెస్‌లో చేరిక 
1990లో తొలిసారిగా రాజస్థాన్‌ మంత్రిగా బాధ్యతలు
తాజాగా వరించిన 
కేంద్ర  మంత్రి పదవి
సోనియాగాంధీతో సన్నిహిత సంబంధాలు
రాజకీయాల్లో తనదైన ముద్ర 



          రాజకీయ నాయకులిగా, రచయిత్రిగా, ఫ్రొఫెసర్‌గా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు గిరిజా వ్యాస్‌. ఫిలాసఫీలో డాక్టర్‌ చదివి ఫ్రొఫెసర్‌గా మంచి ఉద్యోగంలో ఉన్నా అది చాలు అని అనుకోలేదు. ఏదో సాధించాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చింది. ఎంతో మంది మహిళలకు తన వంతు సాయం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా అత్యున్నత పార్టీ పదవులను కూడా అలంకరించింది. పలువురి మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికి ఉదయ్‌పూర్‌ యూనివర్శిటిలో ఆమెను ప్రొఫెసర్‌గానే అనుకుంటారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆమె గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

                    భారత రాజకీయాలలో గిరిజా వ్యాస్‌ ఒకరు. ఈమె రచయిత్రి కూడా. గిరిజా ప్రస్తుతం 15వ లోక్‌సభలో దిగువ సభకు చిత్తోర్‌ఘర్‌ నియోజకవర్గం నుంచి పోటీి చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళ కమిషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. రెండు రోజుల క్రితం జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఈమె గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. గిరిజా జూలై 8న 1946లో కృష్ణశర్మ, శ్రీమతి జమున దేవి లకు జన్మించారు. చదువులో డాక్టరేట్‌లో ఫిలాసఫీ చేశారు. తరువాత ఆమె బోధించడానికి ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్‌ సుఖాడియా యూనివర్శిటికి, యూనివర్శిటీ ఆఫ్‌ దెలవేర్‌లకు వెళ్లారు. 1985లో గిరిజా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1990లో రాజస్థాన్‌ ప్రభుత్వానికి మంత్రిగా అనేక సేవలందించారు. 1991లో ఉదయ్‌పూర్‌ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేశారు.

                    తదనంతరం డిప్యూటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1993లో పివి నరసింహారావు ప్రభుత్వంలో అల్‌ ఇండియా మహిళ కాంగ్రెస్‌కు అధ్యక్షరాలిగా వ్యవహరించారు. అంతేకాకుండా 1993-96 వరకు సంప్రదింపుల కమిటీ, పెట్రోలియం, నాచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు. 1996లో మళ్లీ 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో జరిగిన 13వ లోక్‌సభ ఎన్నికలకు కూడా పోటీ చేసి గెలుపొందారు. 1999-2000 సంవత్సరంలో పెట్రోలియం, కెమికల్‌కు సభ్యురాలిగా కీలక పాత్ర పోషించారు. 2004లో రాజస్థాన్‌ ప్రోవిన్షీయల్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షరాలిగా పని చేశారు. గిరిజా వ్యాస్‌ ప్రస్తుతం ఇండో ఇయు సివిల్‌ సోసైటీ, అల్‌ ఇండియా కాంగ్రెస్‌ మిటీ, మీడియా వ్యవహారాలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2005లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం యుపిఎపై పైచేయి సాధించింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంలో గిరిజ జాతీయ మహిళ కమిషన్‌కు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి దాదాపు 2011 వరకు అదే స్థానంలో కొనసాగారు. 2008లో కూడా రాజస్థాన్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

                 అంతేకాకుండా రాజకీయాల్లో రాణిస్తూ కూడా వారి కళపోషణకు మెరుగులు దిద్దారు. గిరిజా వ్యాస్‌ దాదాపు ఎనిమిది పుస్తకాలు రాశారు. ఎహ్సాస్‌ ఇస్‌ కే పర్‌ అనేది పద్యం ఉర్దులో రాశారు. సిప్‌, సముందర్‌ ఔర్‌ మోటి అనే హిందీ పద్యాలు కూడా ఉన్నాయి. నోస్టాల్జియా అనే ఇంగ్లీష్‌ శ్లోకాలు కూడా ఉన్నాయి. 1971లో ఉదయ్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి ప్రోఫెసర్‌గా చేశారు. బోధన నిమిత్తం ఇతర దేశాలకు గెస్ట్‌ ప్రోఫెసర్‌గా గోల్డ్‌ మోడలిస్ట్‌ అందుకున్నారు. ఉదయ్‌పూర్‌ యూనివర్శిటీలో తిరుగులేని ప్రొఫెసర్‌గా కొనసాగారు. 1967లో యుజిసి ఫెలోషిప్‌ అందించే స్కాలర్‌షిప్‌లను కూడా పొందుకునేవారు. 1967-69 వరకు స్టుడెంట్‌ జనరల్‌ సెక్రటరీగా ఉన్నారు. అంతేకాకుండా 1963-65 వరకు క్రింది ఇతర బాధ్యలు కూడా చేపట్టారు. అల్‌ ఇండియా ఫిలాసఫీ అసోషియేషన్‌, అఖిల భారతీయ దర్శన్‌ పరిషత్‌, ఇంటర్‌నేషనల్‌ నియోప్లాటోనిక్‌ సోసైటి, అమెరికన్‌ ఫిలోసాఫికల్‌ అసోషియేషన్‌, అసోషియేషన్‌ ఫర్‌ ఏషియన్‌ స్టడీస్‌ వాటితో పాటు పుస్తి భక్తి అనే పత్రికను కూడా నడిపారు. ఇది 1982లో చంఢిఘర్‌లో అల్‌ ఇండియా ఫిలాసాఫికల్‌ కాంగ్రెస్‌ అధ్వర్యంలో జరిగేవి.

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

తరుణీ .. ధిల్లానా !

6/21/2013

0 Comments

 
Picture
             కొన్ని అనుభవాలు ఎన్నో పాఠాలవుతాయి . ఆ పాఠాలే -పాట రూపంలో కొందరి మనసుల్లోంచి బయటకు వస్తుంటాయి. అలాంటి పాటకు మనిషి రూపమిస్తే అదే తరణ్‌ కౌర్‌ థిల్లాన్‌. ఆమె మెుట్టమెుదటి ఇండియన్‌ ఫిమేల్‌ ర్యాప్‌ సింగర్‌. హిప్‌-హాప్‌ శైలిని పుణికి పుచ్చుకుని -ప్రపంచాన్ని ఊపేస్తున్న తొలి భారతీయ మహిళా ర్యాప్‌ సింగర్‌ ఆమె.




                      పేరుకు తగ్గట్టే ఆమె గొంతు హార్డ్‌. పాటతోపాటు ఆమె శారీరక కదలికలూ హార్డ్‌. మత్తెక్కించే గొంతుతో, మైమరిపించే శారీరక విన్యాసంతో అచేతన సంగీత హృదయాలను సైతం చైతన్యపర్చగలనన్న ఆమె నమ్మకమే ఎంతో హార్డ్‌. పుట్టింది భారతగడ్డమీదే అయినా, కుటుంబ పరిస్థితుల కారణంగా యుకె తరలిపోయిన హార్డ్‌ కౌర్‌ అసలు పేరు తరణ్‌ కౌర్‌ థిల్లాన్‌. విచిత్రమైన గొంతుతో అటు బాలీవుడ్‌లోనూ సంచలనాలను సృష్టించిన కౌర్‌ను పాటలు వెతుక్కుంటూ వస్తున్నాయి. మరోపక్క ఆల్బమ్స్‌ను డిజైన్‌ చేస్తూనే బిజీగావున్న కౌర్‌ కొద్దికాలంగా స్టేజ్‌ షోలుతోనూ మరింత బిజీ అయిపోయింది. కొద్దిరోజుల క్రితం తుబోర్గ్‌ స్ట్రాంగ్‌ ఫన్‌గామా నైట్స్‌ కార్యక్రమంతో అమృత్‌సర్‌ను ఊపేసిన హార్డ్‌ కౌర్‌ గురించి కాస్త తెలుసుకుంటే.. 

                        ఉత్తర్రపదేశ్‌లోని మీరట్‌లో పుట్టింది తరణ్‌ కౌర్‌ థిల్లాన్‌. తరణ్‌ తల్లి నడిపే చిన్న బ్యూటీపార్లరే వాళ్లకు జీవనాధారం. 1984లో తలెత్తిన సిక్కు వ్యతిరేక ఘర్షణల్లో తండ్రి సజీవంగా దహనమయ్యాడు. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే తల్లి నడుపుతున్న బ్యూటీ పార్లర్‌ సైతం అగ్నికీలల్లో దగ్ధమైంది. కుటుంబం మొత్తం రోడ్డున పడటంతో తరణ్‌ కుటుంబం వలసపోక తప్పలేదు. లూథియానాకు తరలిపోయి అమ్మమ్మ ఇంట ఆశ్రయం పొందిన తరణ్‌ కుటుంబం, మూడేళ్లు తిరగకముందే మరో మార్పు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్‌ఆర్‌ఐతో ప్రేమలో పడిన తల్లి అతన్ని పెళ్లి చేసుకోవడంతో మాతృభూమి భారత్‌ను వదిలి పెట్టాల్సి వచ్చింది. లండన్‌లోని బర్మింగ్టన్‌కు తరలిపోవడంతో తరణ్‌ బాల్యం అంతా అక్కడే సాగిపోయింది. బర్మింగ్టన్‌లో తల్లి నిర్వహించిన బ్యూటీ సెలూన్‌లోనే ఉంటూ, హిప్‌-హాప్‌ శైలి సంగీతానికి ఆకర్షితురాలైన తరణ్‌ ర్యాప్‌ సంగీతం వైపు తన కెరీర్‌ మలుచుకోవాలని ఆశించింది.

                   ర్యాప్‌ సంగీతాన్ని వంటబట్టించుకున్న తరణ్‌ మొట్టమొదట పాడిన పాట ఏక్‌ గ్లాసీ. తొలి అడుగే బలంగా వేసిన థిల్లాన్‌, సింగిల్‌ ఆల్బమ్‌ విడుదల తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. ఫిమేల్‌ ర్యాప్‌ సింగర్‌గా అనూహ్యమైన పేరు ప్రతిష్టలు వచ్చేయడంతో, తరువాత తన గొంతును బాలీవుడ్‌ మీదకు సంధించింది. 2007లో శ్రీరాం రాఘవన్‌ చిత్రం జానీ గదార్‌లో పైసా ఫెక్‌ పాటతో ఉర్రూతలూగించడంతో బాలీవుడ్‌ ఆమె కాల్షీట్ల కోసం క్యూ కట్టింది. అగ్లి ఔర్‌ పగ్లి, సింగ్‌ ఈజ్‌ కింగ్‌, కిస్మత్‌ కనెక్షన్‌, బచ్‌న ఏ హసీనో, రామ్‌గోపాల్‌ వర్మ చిత్రం ఆగ్‌, ఆజాబ్‌ ప్రేమ్‌ కి గజాబ్‌ కహానీ, ప్రిన్స్‌ (2010) చిత్రాల్లో -తరణ్‌ కౌర్‌ గొంతు థిల్లాన్‌లే పలికించింది. 2008లో ఆమె ప్రదర్శన లైవ్‌ ఎర్త్‌ ఇండియా, అంతకు ఏడాది ముందు విడుదలైన సోలో ఆల్బమ్‌ సుపావుమన్‌ సూపర్‌హిట్టు కొట్టడంతో తరణ్‌ ఊపునకు తిరుగులేకుండా పోయింది. 

                   2008లో యుకె ఆసియన్‌ మ్యూజిక్‌ అవార్డుల కోసం రెండు విభాగాల్లో నామినేట్‌ అయ్యింది తరణ్‌ కౌర్‌ థిల్లాన్‌. బెస్ట్‌ అర్బన్‌ యాక్ట్‌ కింద ఒకటి, బెస్ట్‌ ఫిమేల్‌ యాక్ట్‌ విభాగాల్లో నామినేషన్‌ పొందిన కౌర్‌, రెండో విభాగంలో విజయం సాధించి తనేంటో నిరూపించుకుంది.యాడ్‌ ప్రాజెక్టుల్లో సూపర్‌ సెన్సేషన్‌ సృష్టించిన వొడా ఫోన్‌ థీమ్‌ సాంగుకు కంపోజర్‌ తరణ్‌ థిల్లానే.ఎమినెమ్‌ బృందం డి12తో కలిసి హార్డ్‌ కౌర్‌ మరో ఆల్బమ్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. జలక్‌ ధిక్కాలాజా లాంటి టెలివిజన్‌ రియాల్టీ షోలలో సైతం తన విచిత్ర శారీరక విన్యాసాల్ని ప్రదర్శించి తనేంటో నిరూపించుకుంది తరణ్‌..

మూలం : సూర్య దినపత్రిక 

0 Comments

ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు

6/21/2013

0 Comments

 
Picture
                   ఆమె ఆత్మవిశ్వాసం ఆకాశమంత ఎత్తైనది, పట్టుదల భూలోకమంత విశాలమైనది. కొండలు, గుట్టల్లాంటి అవాంతరాలు ఎన్నెన్నో ఎదురౌతున్నా వాటన్నింటిని గడ్డిపరకల్లా భావించింది. ఒక లక్ష్యం కోసం సాగిపోతున్నప్పుడు వెనక్కినెట్టే దుష్టశక్తులు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. అర్హతలు, సామర్థ్యం ఎన్ని ఉన్నా మహిళ అనే భావం లింగబేధాల అంతరాలను సృష్టించి, నిరాశపరచే సన్నివేశాలకు కొదవ వుండదు. అయినా వెనుక వాటినన్నిటినీ మరచి, ముందుకు సాగిపోవాలి, ఏదో సాధించాలి, సమాజాభివృద్ధికి పాటుపడాలనే తపన ఉన్నవారికి ఇలాంటి సవాళ్లు ఒక లెక్కకాదు. అందునా ఆర్థికరంగంలో ఎదగాలంటే ఎంతగా ఒదిగివుండాలో చెప్పనక్కర్లేదు. ఈ లక్ష్యంతోనే బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశించారు షిఖాశర్మ.
                        

                  అంచెలంచెలుగా ఎదిగి, నేడు ప్రైవేట్‌ బ్యాంకుల్లో అతిపెద్ద మూడవస్థానాన్ని ఆక్రమించిన యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండి, సిఇవోగా షిఖాశర్మ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఉన్నపళంగా ఆమె ఆకాశానికి ఎదగలేదు. ఆ స్థానానికి చేరుకునేందుకు ఆమెకు దాదాపు 30సంవత్సరాల కాలం పట్టింది. తను పనిచేస్తున్న సంస్థలో నమ్మకంగా చేయడమే కాదు, బ్యాంకును లాభాల బాటలో నడపడంలో ఆమె చేసిన ప్రయత్నాలే నేడు అత్యున్నతస్థాయికి చేర్చింది.


                  సాధారణంగా ఎక్కువశాతం మహిళలు సాదాసీదా రంగాల్లో పనిచేసేందుకు ఇష్టపడతారు. వృత్తిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, అందులో ఉన్నతస్థానాన్ని చేరుకోవాలనే ఆకాంక్ష ఉన్న స్త్రీల శాతం చాలా తక్కువ. అందునా బ్యాంకింగ్‌ వంటి ఆర్థికసంస్థల్లో రాణించాలంటే 'వామ్మో! అది మనకు చేతకాదులే' అని తేలిగ్గా కొట్టిపారేస్తారు. కానీ షిఖాశర్మ కూడా అలాగ భావించి ఉంటే ఈనాడు యాక్సిస్‌బ్యాంక్‌కు ఎండి, సిఇవో స్థాయికి ఎదిగి ఉండేవారు కారు. ఆశయం, పట్టుదల ఉండాలే కానీ మహిళలకు అసాధ్యమైన రంగం అంటూ ఏదీ లేదు. నేటి మహిళలకు అన్ని అవకాశాలు, సదుపాయాలు, వసతులతోపాటు విపరీతమైన పోటీ కూడా విపరీతంగా ఉంది. ఇవేవీ మనలో ఉన్న ఆశయాలను దెబ్బతీయలేవు. ఎదిగేందుకు ఇవి ఆటంకాలు కూడా కావు. కష్టపడేతత్వం, ఒక ప్రణాళిక, ఆత్మవిశ్వాసం చాలు మీరనుకున్న స్థాయికి చేరుకునేందుకు అంటారామె.
   

                 అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో ఎంబిఎ చదివిన ఆమె 1980లో ఒక ఫైనాన్స్‌ కంపెనీలో తన కెరీర్‌ను ఆరంభించారు. అకడమిక్‌గా మంచి ర్యాంకు షిఖాకు ఉన్నా, కెరీర్‌లో చొరవగా దూకే తత్వం లేనికారణంగా విదేశీసంస్థలో పనిచేయాలనే ఆశయం ఉన్నా, అందుకు ఆ కంపెనీలు అవకాశాన్ని ఇవ్వకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు. ఆ తర్వాత ఆమె ఐసిఐసిఐలో పనిచేసే అవకాశం లభించింది. తనలో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిచేసుకుని, వృత్తిలో ఉన్నతంగా ఎదగాలనే సంకల్పం ఆమెలో మొదలైంది. ఐసిఐసిఐ ఫ్రూడన్షియల్‌లో అంచలంచెలుగా ఎదుగుతూ దాదాపు 29 సంవత్సరాలు ఆ బ్యాంకులోనే పనిచేశారు. షిఖా తన నైపుణ్యం ద్వారా కేవలం రెండు సంవత్సరాల్లోనే 280 కోట్ల ఆదాయాన్ని ఆ బ్యాంకుకు సమకూర్చి, ఔరా! అనిపించుకున్నారు. అక్కడితో మొదలైన ఆమె కెరీర్‌ వృద్ధి మళ్లీ వెనుతిరిగి చూసుకోలేనంత ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 2009లో ఐసిఐసిఐ నుంచి యాక్సెస్‌ బ్యాంకుకు మారారు.
లోపమే కలిసి వచ్చింది
 

                  షిఖాశర్మ ఎక్కువగా ఇంటరావర్ట్‌ (తనలోతాను)గా ఉండడం తన కెరీర్‌కు ఒక మైనస్‌పాయింట్‌ ఉండేది. కానీ అదే యాక్సిస్‌బ్యాంకుకు వరంగా మారింది. షిఖాశర్మ అలా ఇంటరావర్ట్‌గా ఉంటూ, బ్యాంకు లాభాల్లో నడవాలంటే అందుకు ఏమేం చేయాలో సలహాలు, సూచనలు ఇచ్చేవారు.


                ఆమె సలహాల్లో ఉన్న నైపుణ్యత, అవి ఆచరణయోగ్యంగా ఉండటమేకాక అవి బ్యాంకు లాభాలకు దోహదపడ్డాయి. అంతేకాక బోర్డు మీటింగ్‌ సందర్భాల్లో ఆమెచ్చిన సలహాలే కంపెనీ అభివృద్ధికి బాటలు వేశాయి. 
కుటుంబనేపథ్యం


               షిఖాశర్మ భర్త సంజయశర్మ. ఎంబిఎ చదువుతున్నప్పుడే తన బ్యాచ్‌కు చెందిన సంజయశర్మను వివాహమాడారు. ప్రస్తుతం ఈయన టాటా ఇంటర్యాక్టివ్‌ సిస్టమ్‌లో ఎండిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరికి ఒక బాబు, ఒకమ్మాయి ఉన్నారు. ముంబయిలోని వర్లీలో ఒక ఉన్నతమైన భవనంలో ఈ బ్యాంక్‌ ఉంది. ఎనిమిదవ అంతస్తులో ఎకనామిక్స్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు, ఆమె కుటుంబ ఫొటోతో ఎంతో సింపుల్‌గా షికా ఛాంబర్‌ ఉంటుంది. యాక్సిస్‌బ్యాంక్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ స్టాఫ్‌ మాత్రం కార్పొరేట్‌ ఆఫీసులను తలపించేలా వారి ఛాంబర్లు ఉంటాయి. బ్యాంకుకు ఉన్నతమైన హోదాలో ఉన్నా షిఖా మాత్రం ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారో, ఆమె ఛాంబర్‌ కూడా ఎలాంటి ఆడంబరాలు, విలువైన ఫర్నిచర్లు కాక, సాదాసీదాగా ఉంటుంది. 


కుటుంబం, వృత్తి ఒక సవాలే...
                     'నా కుమారుడికి ఉద్యోగం వచ్చిన కొత్తలో నా డ్యూటీకి సెలవు పెట్టాను. అంతే ఆ కొద్ది సమయంలోనే బ్యాంకులో పలు ఉపద్రవ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో వెంటనే నేను డ్యూటీలో చేరాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఉద్యోగం, కుటుంబం ఈ రెండూ మహిళలకు ఒక సవాలుతో కూడిన అంశమే' అంటారు షిఖా తన అనుభవాలను పంచుకుంటూ..


అవార్డులు
                  షిఖాశర్మ బ్యాంకుల లాభాలకు చేసిన విశేషకృషికి గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. 2012 ఎఐఎంఎ వారిచ్చిన 'బిజినెస్‌ లీడర్‌', 2012లో యుటివి ఫైనాన్స్‌ ఇచ్చిన 'ఉమెన్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌', ఇదే సంవత్సరం 'బిజినెస్‌ వర్డ్స్‌ బ్యాంకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌', మిలియన్‌ ఉమెన్‌ వంటి అవార్డులను పొందారు. 'వృత్తి పట్ల్ల అంకితభావం, ఆ సంస్థ తనదిగా భావించినప్పుడు మాత్రమే ఆ సేవలు కంపెనీ అభివృద్ధికి దోహదపడుతుందని' అంటారామె. ఇలాంటి మహిళలు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. వారిని గుర్తించి, తగిన ప్రోత్సాహం అందిస్తే, మనదేశ ఆర్థికాభివృద్ధిలో మొదటిస్థానంలో ఉంటుందనడంలో అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అంటారు షిఖాశర్మ.

మూలం : వార్త దినపత్రిక 

0 Comments
<<Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013

    Categories

    All
    ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం
    ఆ మూడేళ్లూ కంటినిండా నిద్రలేదు..
    ఏ ఆడబిడ్డనూ ఇటువైపు రానివ్వను
    ఆటో కుమారి
    వేల మందికి కొత్త జీవితం!
    ఈమె పత్రికే ఓ రికార్డు
    పాత చిత్రాల పోస్టర్లతో ...కొత్త డిజైన్లు
    ఆమె ప్రతిభకు అమెరికా ప్రోత్సాహం
    ఇదొక 'అత్యవసర' సేవ!
    ఖేల్ రత్న కుంజరినీ దేవి
    రజనీ బాలలు
    తొలి మహిళా మంత్రి
    జీవన రాగమే మూగబోయింది
    నవీన వనితకు స్ఫూర్తి ప్రదాత.. శారదా దేవి
    కలలు డిజైన్ చేసుకున్న అమ్మాయి
    ఒంటి కాలితో గెలిచింది!
    వందల మందిని కాపాడింది...
    అడవి తల్లికి ఆడబిడ్డల పహరా
    ఐరాస మెచ్చిన అమ్మాయిలు
    పంటల పాఠాలమ్మ
    వసతి గృహాల్లో 'మనో పాఠాలు'
    సహాజ చిత్రాలతో కొత్త అందాలు
    సాయం చేసేందుకు పత్రిక పెట్టింది!
    జీవన సందేశానికి ఒక్క కుంచె చాలు!
    ధ్యాస
    తరుణీ .. ధిల్లానా !
    నిన్న ఆటో డ్రైవర్.. నేడు లాయర్..!
    అంధుల కోసం పత్రిక
    నృత్య వైభవం
    బుకర్ బరిలో జుంపా
    పాతిక లక్షల నష్టం పాఠాలు నేర్పింది!
    లక్కీ ఛాన్స్
    ఈమెను చూస్తే లోకమే చిన్నబోతుంది
    నెలలు నిండని జ్ఞాపకాలు
    తిండి మారితేనే తరాలు బాగుపడతాయి
    మహిళా సమస్యలపై పోరాటం
    చీకటి జీవితాలకు కొత్త వెలుగు...
    మహిళా సాధికారతే లక్ష్యంగా మన్ దేశీ
    ఖైదీల జీవితాల్లో కాంతిరేఖ
    పక్షి ప్రేమికురాలు
    మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తి
    పరుగుల షైనీ
    అందమైన సెల్ కవర్లు ఫేస్ బుక్ లో అమ్మేస్తా!
    అవయవాల పంటకు అక్షర సేద్యం
    అశ్వనీ మలాలా!
    కావ్యా టీచర్...మా బడికి రండి
    విరామం తర్వాత విజేతలయ్యేలా!
    మనసుకు నచ్చిందే చదువు
    సాగులో ఆందెవేసిన చేయి కూతురే కొడుకయింది
    అద్భుత ప్రతిభాశాలి వి.యస్. రమాదేవి
    రొమ్ము క్యాన్సర్‌పై జనచైతన్యం
    సేవలోనూ రాణే
    అనుపమాన కృషి
    కారుణ్య బంధం
    రేసింగ్ బైక్ పై నవతరం అమ్మాయి
    అందులకు అండగా..
    నైనానంద ప్రతిభ
    అక్షరమే అతివకు అండ..
    ప్రపంచం మరువలేని మేడమ్‌ క్యూరీ
    ఉపాధితో వెన్నుదన్ను
    ఆకాశమంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
    సమస్యలను మించి పరుగు
    పరదేశంలో చదువు మనదేశంలో సేవ
    పడిలేచిన కెరటం..!
    రుక్మిణి త్యాగం
    తండ్రిని మించిన తనయ
    రుబ్బుడు చదువులు మనకొద్దు :సుచిస్మిత
    పద్మశ్రీ వారియర్‌
    ఆదివాసుల ఆత్మఘోషకు తొలి కదలిక
    వీరీవీరీ గుమ్మడిపండ్లు
    తెలుగందం... మెరిసింది
    ఆణిముత్యం
    ఎగిరిపోతే ఎంత బాగుందో!
    రికార్డుల రాణి ఎలెనా
    అమ్మలగన్న అమ్మ నరసమ్మ!
    సోనాగచికి కొత్త ఆశాదీపం... ఇషిక!
    వ్యాపారమే జీవితం
    విజయోత్సవ నృత్యం
    ఆత్మరక్షణ పాఠాలతో అండ
    సమాజాన్ని కుంచెతో తట్టిలేపిన ధీర
    హైదరాబాద్ సంస్కృతి అంటే ప్రాణం
    స్వాతంత్య ఉద్యమంలో...మహిళామణులు
    ఆఫ్రికాలో అన్నపూర్ణ...
    పాకిస్తాన్ లో తొలి మహిళా ఫైటర్ పైలట్
    మనోనేత్రమే ఆమె జీవిత నేస్తం
    పాకిస్తాన్ సాహాస బాలిక .. మలాలా
    అంతర్జాతీయ కీర్తి కిరీటం
    మృత్యువునే పరిహసించిన సాహస బాలిక
    తెల్లమ్మాయి 'చెత్తశుద్ధి'
    కెమెరాఉమెన్ మల్లీశ్వరితో…
    ఆత్మవిశ్వాసం
    స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా
    ప్రశ్నిస్తేనే ప్రపంచం తెలిసేది...
    కాల్పనికకథలతో ఓలలాడించిన కలం
    1f435d7218
    24050e4082
    245c28fe88
    261cdb5043
    2818b63e80
    28389ca502
    2b0e1c1639
    2fa703fa92
    అంచెలంచెలుగా ఎదిగిన మహిళ: పాక్ విదేశాంగమij
    ఎన్నారై భర్తతో గెంటివేయబడ్డ కోమల్ ప్రవీణ
    హార్వార్డ్ లో భారతీయ తొలి మహిళా ప్రొఫెసరĺ
    31c13c6389
    3554a3419a
    35656ad80d
    55a74999b9
    5780c63669
    57c51a6293
    581f19c0c8
    596314788a
    5b25932644
    601df7f45e
    6038f96c83
    60bb50a07e
    6ac90962a4
    6acc2723b8
    6eceeac0ef
    72a7da41c2
    88cfd59ee5
    994726a014
    A2999c254a
    A31cb50ffd
    A90748427f
    Aaf6b495b5
    B68abb9e8a
    B72ae5d725
    C08f40206b
    E88f0055d9
    F3fc20019d
    F85bffc883
    F9ded65a21
    Fbb115455d
    Fcf7a2fc59
    Freedom Fighter Laxmi Sehgalpng5013f7c557

    RSS Feed


Powered by Create your own unique website with customizable templates.